How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

బ్రాహ్మణ సత్యాలూ, ఐలయ్య అభియోగాలూ















బ్రాహ్మణ జాతి దళిత బహుజనుల ఎదుగుదలను ఆహ్వానిస్తున్నది, ఆశీర్వదిస్తున్నది, జేజేలు పలుకుతున్నది. సమాజంలోని ఉన్నత వర్గాలకు దీటుగా వారి భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నది. బ్రాహ్మణులకు సద్బుద్ధి, సదాచారం, సత్ప్రవర్తన, సౌశీల్యం, అహింసావాదం, పరోపకార బుద్ధి, ధర్మనిష్ఠ, క్షమాబుద్ధి ఉన్నాయి. ఉండబట్టే ప్రొఫెసర్ ఐలయ్య బ్రాహ్మణులను 'బాపనోళ్ళు' అని సంబోధించినా 'కృష్ణార్పణం' అని నిర్ణయాన్ని కాలానికే విడిచి పెట్టారు.

దాదాపు మూడు నెలల క్రితం ఎబిఎన్ టీవి ఛానెల్ అధిపతి రాధాకృష్ణగారు ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలను (2013, ఏప్రిల్ 24) 'ఆంధ్రజ్యోతి ' దినపత్రికలో చదివాను. కానీ నేను 76 సంవత్సరాల వృద్ధాప్యం లో ఉండటం వల్లనేమి, ఉష్ణతాపం వల్లనేమి, శ్రమకు శరీరం ఎక్కువగా సహకరించకపోవటం వల్లనేమి బ్రాహ్మణులపై ఐలయ్య వెలిబుచ్చిన అభిప్రాయానికి వెంటనే స్పందించలేకపోయాను. 'మీరు బ్రాహ్మణులను ఎందుకు ద్వేషిస్తున్నా'రని ఐలయ్యను రాధాకృష్ణ ప్రశ్నించగా తనకు బ్రాహ్మణులంటే వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేదని నమ్మ పలికారు. బ్రాహ్మణులపై ద్వేషం లేనప్పుడు తాను దళిత బహుజన సమాజ ప్రతినిధిగా ద్వేషిస్తున్నారా అనే విషయాన్ని రాధాకృష్ణ ప్రశ్నించక పోవటం వల్ల, ఆ అవకాశాన్ని ఐలయ్య తన సందిగ్ధ సమాధానానికి రక్షణ కవచంగా ఉపయోగించుకున్నారు. ఐలయ్య గారి 'నేను హిందువునెట్లైతా?' అనే పుస్తకాన్ని ఆసాంతం చదివే ఓపిక లేకపోయినా అక్కడక్కడ చదివితే బ్రాహ్మణుల పట్ల ఆయన చెప్పిన సమాధానంలో ఎంత నిజాయితీ ఉన్నదో స్పష్టంగా కనిపిస్తుంది.

బ్రాహ్మణులపై తనకు ద్వేషం లేదని ఐలయ్య అన్నారు. అంటే వారు సామాజిక న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకొని బ్రాహ్మణులను 'బాపనోళ్ళు'గా వారి భాషలో కీర్తిస్తూ దళిత బహుజన సమాజం తరఫున చేసిన వ్యాఖ్యగా భావించ వలసివస్తుంది. మొదటి తరానికి చెందిన మహానుభావులు ఫూలే, డాక్టర్ అంబేద్కర్, ఈ తరం వారైన కాన్షీరామ్, మాయావతి, రాష్ట్ర దళిత, బహుజన సమాజ ప్రతినిధులైన మంద కృష్ణ, మల్లెపల్లి లక్ష్మయ్య, యన్. ఇన్నయ్య, ఏ.కనకయ్య మొదలైన వారు, ఇంకా వివిధ దళిత, బహుజన సంఘాల నాయకులు సమాజంలో తమ ఉనికికి, అభ్యుదయానికి, వికాసానికి పోరాడారే తప్ప ప్రత్యేకంగా బ్రాహ్మణులను 'బాపనోళ్ళు'గా హేళనాపూర్వకంగాకానీ, అసభ్యకరమైన భాషలో ప్రకటనా రూపంలో గానీ, సభాముఖంగా కానీ ప్రస్తావించటం నేను వినలేదు. ఒక్క ప్రొఫెసర్ ఐలయ్య మాత్రమే అంబేద్కర్ మహాశయుని తర్వాత కుల వివక్షపై పోరాడిన ఏకైక వ్యక్తిగా ప్రకటించుకుంటూ బ్రాహ్మణులపై నిరంతర దాడికి సమాయాత్తమైనారు.

' నేను హిందువు నెట్లైతా?' అనే అశాస్త్రీయ్ర గ్రంథానికి ప్రొఫెసర్ ఐలయ్య ఆ పేరు ఎందుకు పెట్టారు? ఆయన్ని నీవు హిందువువని ఎవరైనా ఆక్షేపించారా? తనకు ఈ అపనమ్మకం ఎట్లా కలిగింది అనే విషయమై ఈ పుస్తకం ద్వారా తనకు తానే ప్రశ్నించుకున్నట్లు, వారికి వారే సమాధానం వెతుక్కున్నట్లు భావించవలసి వస్తుంది. తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదంటూనే తాను రాసిన పుస్తకంలో తుది పూట నుంచి తుదిపూట వరకు దాదాపు ప్రతిపేరాలో బ్రాహ్మణులను దూషిస్తూ కించపరుస్తూ మానసికంగా హింసిస్తూ పరిహసించి పరవశించిన కొన్ని సందర్భాలు మాత్రమే పత్రికాముఖంగా దళిత బహుజన సంస్థల ప్రతినిధుల దృష్టికి తీసుకొని రావటానికి సాహసించటం సబబుగానే భావిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులయిన బ్రాహ్మణులు స్వాతంత్య్రానంతరం దళిత బహుజనులను అణగద్రొక్కి వారిని పైకిరాకుండా చేసి రాజకీయ వ్యాపార రంగాల్లో తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారని ఐలయ్య ఆరోపించారు. ఆరోపణలను రుజువుపరిచే ఆధారాలు ఏ ఒక్కటి కూడా చూపలేకపోయినారు. బ్రాహ్మణులు సృష్టించి పోషిస్తున్న దేవతలకు దయ్యాల లక్షణాలు ఉన్నాయని విదేశాలలో నిర్ధారించి ప్రశంసా పత్రాలు పొందినట్లు ప్రకటించుకున్నారు. బ్రాహ్మణులు పెట్టుబడిదారీ మార్కెట్‌ను తమ వశం చేసుకొని దళిత బహుజనులను తమ స్థాయికి ఎదగనీయకుండా చేశారని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పారిశ్రామికవేత్తలు, మేనేజర్లు, డైరెక్టర్లు, సూపర్ వైజర్లు, ఇతర ఉద్యోగులు అందరూ బాపనోళ్ళని చివరకు హోటళ్ళపై కూడా వారి ఆధిపత్యం పెంచుకున్నారని, ఒక మాదిగ హోటలు , ఒక చాకలి హోటలు, ఒక గొల్ల హోటలు ఎక్కడా కనపడదని పేర్కొన్నారు. సమాజంలోని ఒక వర్గంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఆ ఆరోపణలకు సంబంధించిన వ్యక్తి, కులం, మత సమాచారాన్ని పూర్తిగా సేకరించి రుజువులు కూడా బహిర్గతం చేయటం న్యాయంగా ఉంటుంది.

అలా చేసినప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రాహ్మణులు ఆత్మ విమర్శ చేసుకోవటానికి లేదా ప్రతిఘటించటానికి వీలు కలిగేది. లేకుంటే ఆరోపణలు ద్వేషపూరితమైనవని, అభూత కల్పనలని భావించవలసి వస్తుంది. బాపనోళ్ళు తమ ఇంటిలో దళితులకు కిరాయికి ఇవ్వమని బోర్డు పెడతారని ఆరోపించారు. ఈ ఆరోపణ నూరు శాతం అబద్ధం. తెలంగాణలో గానీ, ఆంధ్ర ప్రాంతంలో గానీ ఇటువంటి ఆరోపణలకు తావు లేదు. అయితే బ్రాహ్మణులు తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కుల ప్రసక్తి తీసుకురాకుండా శాకాహారులకు మాత్రమే ఇస్తామని చెపుతారు. దళిత బహుజనులు నా అభిప్రాయాన్ని విశాల దృక్పథంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
బాపనోళ్ళు సృష్టించిన ఇంద్రుడు ఆర్యుల మూల పురుషుడట. అతను ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే దళిత స్త్రీలను బానిసలుగా చేసుకుని తన కామవాంఛ తీర్చుకున్నాడట. ఈ సమాచారాన్ని ఏ చారిత్రక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి ప్రొఫెసర్ ఐలయ్య సేకరించారు? బ్రాహ్మణులు సృష్టించిన బ్రహ్మ ఎప్పుడూ నాగలిపట్టి దున్న లేదని, నిరక్షరాస్యురాలైన సరస్వతి కలుపు తీసినట్టుగానీ, విత్తనాలు చల్లినట్లు గానీ, కోతలు కోసినట్లు గానీ దాఖలాలు లేవని ఐలయ్య ఉవాచ. బ్రాహ్మణుల, క్షత్రియుల వైవాహిక సంబంధం వలనే విష్ణుమూర్తికి నీలిరంగు శరీరం వచ్చిందని ఐలయ్య రాశారు. బ్రాహ్మణవాదం గురించి మాట్లాడుతూ సరస్వతీ దేవి, దళిత బహుజన స్త్రీలకు చదువు అందకుండా చేసిందని, లక్ష్మీ దేవి దళిత బహుజన స్త్రీలకు సంపద అందకుండా చేసిందని పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ముమ్మడివరం బాలయోగి హరిజనుడు. అన్నపానాలు ముట్టక విష్ణుమూర్తి అనుగ్రహం కోసం పది సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఆ దేవుని అనుగ్రహం పొందాడు. జగమెరిగిన ఆళ్వారులలో ఒకరు హరిజనుడు. తమిళనాడులో నందుడు వేదాలు, ఉపనిషత్తులు చదివి ఘోర తపస్సుచేసి శివసాన్నిధ్యాన్ని పొందాడు. ఇతనూ హరిజనుడే. దళితుడైన భక్త కన్నప్పకు మోక్షం ఇవ్వలేదా? మైత్రేయి, గార్గి మొదలగు దళిత స్త్రీలు ధర్మశాస్త్రాలు చదివి పండితురాళ్లు కాలేదా? వీరందరూ దళితులైనప్పటికి బ్రాహ్మణులలో పూజలు అందుకుంటున్న విషయం తెలియదన్నట్లు ఐలయ్య ఎందుకు నటిస్తున్నారు? ఒక వేళ సరస్వతీదేవి, లక్ష్మీదేవి దళిత బహుజన స్త్రీలకు అన్యాయం చేసినట్లైతే దళిత స్త్రీలు వారిని తమ ఆరాధ్య దేవతలుగా గౌరవించడం లేదా? సరస్వతి, దుర్గాభవాని భద్రకాళి , పద్మాక్షి , మీనాక్షి, రాజరాజేశ్వరి రూపాలలో ఆరాధించటమే కాకుండా తమ గృహాలలోని పూజామందిరాల్లో వారి ప్రతిమలను ప్రతిష్ఠించుకుని నిత్య పూజలు అందిస్తున్నారు. దేవాలయాలకు వెళ్ళి మొక్కులు తీర్చుకునే భక్తుల్లో దాదాపు 85 శాతం దళిత బహుజన స్త్రీ పురుషులే వుంటారు. నిజాలు తెలుసుకోదలుచుకుంటే ఐలయ్య తన వ్యక్తిగత ఉనికిని పక్కకు పెట్టి దేవాలయాలకు వెళ్ళి చూస్తే తన కంఠశోష, కలం ఘోష ఎంత వరకు దళిత బహుజన స్త్రీీలను ఆకట్టుకున్నదో తెలుసుకుంటారు.

1947 తర్వాత బ్రాహ్మణులు ప్రభుత్వాధికారాన్ని, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని గ్రామాల్లో బ్రాహ్మణ రాజ్యాలు స్థాపించి దళితులను అణచివేశారట. బ్రాహ్మణులు తమ ఇంటిలో తమ వారు తినగా మిగిలిన అన్నం ఎవరికి పెట్టకుండా వారే తింటారట. ఇది ఎంతవరకు నిజమో దళిత బహుజన కుటుంబాలే నిర్ణయించుకోవలసివుంటుంది. ఈ రోజువరకు కూడా బ్రాహ్మణ కుటుంబాల్లో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో తమకు అవసరమైనదాని కంటే కొంచెం ఎక్కువగా వండి, తమ ఇష్ట దైవానికి నివేదన చేసి, ఆ ఆహార పదార్థాలను 'అమ్మా ! ఆకలి'అని ఎవరైనా ఇంటి ముందుకు వస్తే వారికి ఆ నివేదన పదార్థం తినిపిస్తారు; అంతే కాకుండా తాము భుజించవలసిన దానిలో కూడా కొంతలో కొంత తీసిపెడతారు. ఇటువంటి ఆచారం కొన్ని దళిత బహుజన కుటుంబాలలో నేను చూశాను. అది వారి సంస్కారం. ఐలయ్య 'నేను హిందువును కాను, భారతీయుడను'అని ప్రకటించుకున్నప్పుడు ఇటువంటి భారతీయుడిని మోస్తున్నందుకు భారత మాత ఎంతగా కన్నీరు పెట్టుకుందో! ఆయన ఒక అవాంఛనీయ సూచన కూడా చేశారు. దళిత బహుజనులు దేవాలయాల్లోని పూజారులను గెంటివేసి, ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకొని, దళిత బహుజన మేధావుల నిర్వహణలో జనవిద్యాకేంద్రాలను స్థాపించి బ్రాహ్మణులకు శిక్షణ ఇస్తూ వారి మస్తిష్కాలను ప్రక్షాళణ చేయాలన్నదే ఆ సూచన! ఫూలే, అంబేద్కర్‌లు కుల వివక్ష పై ఎడతెగని పోరాటం చేశారు. దళితులను అగ్రకులాలవారితో సమాన స్థాయికి తీసుకురావడానికి కృషిచేశారే గానీ ఇటువంటి దురదృష్టకరమైన ఆలోచనలు చేయలేదు. బ్రాహ్మణులు తమ స్వార్థంతో దళిత బహుజనులను నిరక్షరాస్యులను చేశారట.
ఐలయ్య ఆరోపణలను విశ్లేషిస్తే ఈ రోజు బహుజనులు పోటీ తత్వంతో విద్య, ఆర్థిక, రాజకీయ ప్రభుత్వరంగాలను శాసిస్తుంటే బ్రాహ్మణ కుటుంబాలు మందు బలం, మంద బలం, ఆర్థిక బలం, రాజకీయ బలం, రౌడీ బలం లేకపోవటం వల్ల తమ పిల్లలను పైచదువులు చదివించుకోలేక ఆడపిల్లల పెళ్ళిళ్లు చేసుకోలేక దిన దిన గండంగా జీవితం గడుపుతున్నారు. నిష్కల్మష హృదయులైన, బ్రాహ్మణ ద్వేషం లేని దళిత బహుజనులు, వారి నాయకులు రాత్రిపడుకునే ముందు తమ రెండు చేతులను గుండెపై పెట్టుకుని ఆత్మ ను సాక్షిగా ఎంచుకొని నా ఈ మాటలను పరిశీలిస్తే నిజాన్ని అంగీకరిస్తారు.


ఈ రోజు మన రాష్ట్రంలోని సాంకేతిక విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో దళిత బహుజన విద్యార్థులు సమకూర్చిన ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ పోటీ తత్వం పెంచుకుని తమ వర్గ ఔన్నత్యాన్ని అగ్రకుల స్థాయికి తీసుకుని పోతున్నారు. భారతదేశ సనాతన సంస్కారాన్ని ప్రపంచ దేశాలలో వ్యాప్తిచేసి భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేయటానికి అకుంఠిత దీక్షతో తమ మేధస్సుకు పదును బెట్టి విద్యా వికాసానికి ప్రయత్నిస్తున్నారు. బ్రాహ్మణ జాతి దళిత బహుజనుల ఎదుగుదలను ఆహ్వానిస్తున్నది, ఆశీర్వదిస్తున్నది, జేజేలు పలుకుతున్నది. సమాజంలోని ఉన్నత వర్గాలకు దీటుగా వారి భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నది. బ్రాహ్మణులకు సద్బుద్ధి, సదాచారం, సత్ప్రవర్తన, సౌశీల్యం, అహింసావాదం, పరోపకార బుద్ధి, ధర్మనిష్ఠ, క్షమాబుద్ధి ఉన్నాయి. ఉండబట్టే ప్రొఫెసర్ ఐలయ్య బ్రాహ్మణులను 'బాపనోళ్ళు' అని సంబోధించినా 'కృష్ణార్పణం' అని, నిర్ణయం కాలానికే విడిచి పెట్టారు. ఇదే వ్యంగ్య భాషలో ఇతర మతస్థులను, కులాలవారిని సంబోధించే ధైర్యం ఐలయ్య చేయలేకపోయారు. ఆయన మేధావి కాబట్టి ఎదుర్కోవలసిన పరిణామాల గురించి ముందుగానే ఊహించి వుంటారు. తన 'నేను హిందువునెట్లైతా?' పుస్తకం బాపనోళ్ళ ఇండ్లలోకి చొచ్చుకొని పోయినట్లు ఐలయ్య తెలిపారు. ఇది వాస్తవమే. బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలే కాకుండా బైబిల్, ఖురాన్, బుద్ధ గీత, దళిత బహుజనులు రాసిన సాహిత్యం కూడా చదువుతారు. వాటిలో బ్రాహ్మణులకు కూడా అందని విజ్ఞానం వుంటే స్వీకరిస్తారు, ఆదరిస్తారు. కానీ దళిత బహుజనులు, ఐలయ్య తమ నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు పుస్తకాలు రాసుకొని వాటిని అమ్ముకొని ఆర్థికంగా బలపడుతున్నాడని తెలుసుకున్నారు. కనుకనే వారు అట్టి పుస్తకాలను తమ ఇండ్లలోకే కాదు, తమ వాడ పొలి మేరలలోకి కూడా రానివ్వలేదు.
- అల్లూరి హరినాధ శర్మ
విశ్రాంత ఉపసంచాలకులు
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE